సీఎం జగన్ చెప్పింది కరెక్ట్.. కరోనాతో సహజీవనం తప్పదు: వైసీపీ ఎంపీ

కరోనా వైరస్ సాధారణ జ్వరంలాంటిదేనని, భవిష్యత్తులో కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అన్ని ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో అధికార పార్టీ నేతలు సీఎంకు అండగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఎవరైనా విమర్శలు చేస్తే ఒంటికాలుపై లేచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సీఎం వ్యాఖ్యలను సమర్థిస్తూ విపక్షాలపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ఈ మేరకు బుధవారం విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు


‘‘వ్యాక్సిన్ వచ్చేదాక కరోనాతో సహజీనం తప్పదని ముఖ్యమంత్రి జగన్ గారు చెప్పింది 100 శాతం కరెర్ట్. వైరస్ నిర్మూలనకు నేరుగా పనిచేసే మందులేవీ ఉండవు. వ్యాధి లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. ప్లాస్మా థెరపీ ఆశలు రేకిత్తిస్తోంది. కేంద్రం కూడా దీనికి అనుమతించింది.
కరోనా వైరస్ అంటే దోమలపై యుద్ధం, ఎలుకలు పట్టడం లాంటిది కాదు చంద్రబాబూ. దోమలను నియంత్రించావా? వైరస్సూ అంతే. సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నవాడివి నీకేం తెలుసని జగన్ గారిపై విషం చిమ్ముతున్నావు? ప్రజల గురించి మొసలి కన్నీళ్లు కార్చవద్దు. కరోనా కట్టడిలో రాష్ట్రమే ముందు నిలుస్తుంది.’’ అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.